కలం, నిర్మల్: ఆగస్టు 15 సందర్భంగా నిర్మల్ జిల్లాలో ‘సైబర్ జాగృతి దివాస్’ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల సైబర్ భద్రత అవగాహన పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. నకిలీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ యాప్లు, అధిక లాభాల పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మవద్దన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను ధృవీకరించుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కి సమాచారం ఇవ్వడంతోపాటు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ సీఐ సమ్మయ్య పాల్గొన్నారు.
మైనర్ బాలుడిపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ శిక్ష
నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో మైనర్ బాలుడిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి పోక్సో ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గత ఏడాది జనవరిలో చిట్యాల గ్రామానికి చెందిన మైనర్ బాలుడిపై అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్ అలియాస్ రాజు అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. ఈ ఘటనపై అప్పటి ఎస్సై లింబాద్రి పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం రూరల్ సీఐ రామకృష్ణ, ఏఎస్పీ రాజేష్ మీనా దర్యాప్తు చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ రెడ్డి సాక్ష్యాధారాలతో నేరాన్ని రుజువు చేయగా, నిర్మల్ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీవాణి నిందితుడు రాజేశ్వర్కి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

