కలం, నిర్మల్: ఆగస్టు 15 సందర్భంగా నిర్మల్ జిల్లాలో ‘సైబర్ జాగృతి దివాస్’ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల సైబర్ భద్రత అవగాహన పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. నకిలీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ యాప్లు, అధిక లాభాల పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మవద్దన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను ధృవీకరించుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కి సమాచారం ఇవ్వడంతోపాటు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ సీఐ సమ్మయ్య పాల్గొన్నారు.

