కలం, స్పోర్ట్స్ : క్రీడాకారులకు లడాఖ్ భారీ కానుక ఇచ్చింది. కొత్త క్రీడా విధానానికి (Ladakh Sports Policy) అక్కడి పరిపాలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పతక విజేతలకు ఇక నెలవారీ స్కాలర్షిప్లు, ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఈ విధానంలో తొలిసారిగా పాఠశాల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు రాణించే క్రీడాకారులకు ఆర్థిక మద్దతు కల్పిస్తున్నారు. ప్రతిభను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం. పతకం సాధించిన తేదీ నుంచి 12 నెలలు స్కాలర్షిప్ ఇస్తారు.
అంతర్జాతీయ స్వర్ణ విజేతలకు నెలకు రూ.1 లక్ష అందుతుంది. జాతీయ స్వర్ణ విజేతలకు రూ.75 వేల ఇస్తారు. యూటీ స్థాయి స్వర్ణ విజేతలకు రూ.10 వేల చెల్లిస్తారు. రజత, కాంస్య పతక విజేతలకు కూడా విధానంలో పేర్కొన్న మొత్తాలు వర్తిస్తాయి. స్కాలర్షిప్ కాలంలో క్రీడాకారుడు మరింత ఉన్నత స్థాయిలో పతకం సాధిస్తే, వెంటనే అధిక మొత్తంతో కొత్త స్కాలర్షిప్ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకోరు.
నెలవారీ స్కాలర్షిప్తో పాటు ఒకేసారి నగదు ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. ఇవి గుర్తింపు పొందిన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, పాఠశాల స్థాయి పోటీల్లో పతక విజేతలకు వర్తిస్తాయి. పారాలింపిక్స్, పారా క్రీడలు, దృష్టి లోపం, వినికిడి లోపం ఉన్న క్రీడాకారులు, స్పెషల్ ఒలింపిక్స్ అథ్లెట్లకు కూడా ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా 8 వేల మీటర్లకు పైబడిన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన లడాఖ్ క్రీడాకారులకు రూ.10 లక్షల ఒకేసారి నగదు బహుమతి ప్రకటించారు.
ఈ విధానం (Ladakh Sports Policy) ద్వారా క్రీడాకారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు అన్ని స్థాయిల్లో క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిపాలన తెలిపింది. ఈ విధానాన్ని రెండు నెలల పాటు వివిధ వర్గాలతో చర్చించిన తర్వాత రూపొందించినట్లు వెల్లడించింది.
Also Read : యువతకు అజిత్ దోవల్ కీలక సూచన
Follow Us On: Sharechat

