కలం, వెబ్డెస్క్: ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దీనికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్సీ అక్రమాలకు ప్రధాన కారణం మంత్రి లోకేశ్ అని ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లోనే భారీ అవినీతి జరిగిందని అంబటి అన్నారు. మంత్రి లోకేశ్ తనకు కావాల్సిన వాళ్లకు ఆ కోటాలోని ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆరోపించారు.
అర్హత ఉందా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారని అన్నారు. జనరల్ స్పోర్ట్స్ కోటాకు 2 శాతం ఉండాలని, కానీ లోకేశ్ దాన్ని 3 శాతానికి పెంచాడని అన్నారు. దీని కోసం పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో కూడా ఇచ్చారన్నారు. స్పోర్ట్స్ కోటా వాళ్లు ఎగ్జామ్లో పాల్గొనాల్సిన అవసరం లేదని జీవో మార్చి ఇష్టారీతిన నియామకాలు చేశారని విమర్శించారు. నియామకాలు పూర్తయ్యాక మళ్లీ యథావిధిగా పాత జీవోను విడుదల చేశారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపే వరకు, మంత్రి లోకేశ్ రాజీనామా చేసే వరకు వైసీపీ పోరాడుతుందని అంబటి స్పష్టం చేశారు.
Read Also: చనిపోయిన మహిళ బతికింది.. అంతా షాక్!
Follow Us On: Instagram

