కలం, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేసు కేసు (Formula E Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తొలిసారి ఏసీబీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఆయనకు రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. కోర్టు సమన్ల మేరకు కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి కూడా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
ఏసీబీ సమర్పించిన 77 పేజీల చార్జ్షీట్లో కేటీఆర్ (KTR) సహా అరవింద్ కుమార్, బి.ఎల్.ఎన్. రెడ్డి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థలను నిందితులుగా పేర్కొనడంతో పాటు 14 మంది సాక్షుల వాంగ్మూలాలను జతపరిచారు. ఆర్థిక, న్యాయ శాఖలతో పాటు రాష్ట్ర మంత్రివర్గం అనుమతులు లేకుండానే ఫార్ములా ఈ సీజన్-10 నిర్వహణకు నిధులు విడుదల చేశారని, నిబంధనలను ఉల్లంఘించి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఏసీబీ ఆరోపించింది.
దీనివల్ల హెచ్ఎండీఏకు రూ.54.88 కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ. 600 కోట్ల అదనపు ఆర్థిక భారం పడిందని చార్జ్షీట్లో పేర్కొన్నారు. అలాగే ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థకు అనుచిత ప్రయోజనాలు కల్పించినందుకు ప్రతిఫలంగా గ్రీన్కో గ్రూప్ నుంచి బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు అందాయని ఏసీబీ స్పష్టం చేసింది. అయితే ఈ ఆరోపణలను నిందితులు పూర్తిగా ఖండించారు. కోర్టు విచారణ ప్రారంభించడంతో ఈ కేసు ఇప్పుడు తదుపరి దశకు చేరుకుంది.

