కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామంలోని గుర్రపు కుంట చెరువు (Gurrapu Kunta Lake) కు శుక్రవారం గండి పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోవడంతో కట్ట బలహీనపడి ఒక్కసారిగా గండి ఏర్పడింది. దీంతో భారీగా నీరు దిగువనున్న వ్యవసాయ పొలాల్లోకి చేరి పంటచేలు చెరువులను తలపించేలా నీటమునిగాయి.
సమాచారం అందుకున్న గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు అక్కడికి చేరుకుని గండిని పూడ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించారు. చెరువులోని నీరు వేగంగా బయటకు వెళ్లిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గండిని వెంటనే పూడ్చలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.

