కలం, వెబ్ డెస్క్: గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రంలో నటిస్తున్న కియారా అద్వానీ (Kiara Advani) పాత్రకు సంబంధించి వస్తున్న విమర్శలపై ఆమె పరోక్షంగా స్పందించారు. సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయంటూ నెట్టింట చర్చ నేపథ్యంలో ఆమె మాట్లాడారు. తాను ఎప్పుడూ బలమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. మహిళలను కేవలం మూసధోరణి పాత్రలకే పరిమితం చేసే రోజులు పోయాయని, కథ డిమాండ్ మేరకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకోవడంలో తప్పులేదని పరోక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన నరేషన్ విన్న వెంటనే తాను కనెక్ట్ అయ్యానని కియారా వెల్లడించారు. కథలోని లోతు, పాత్రలోని ఇంటెన్సిటీ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. అరుదైన అవకాశం దొరికినందుకే ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. వివాదాలను పక్కన పెట్టి కేవలం నటిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నానన్నారు.

