కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు (Nizamabad Rains ) విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలంలో కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వర్షా కాలంలో వరదలకు కొండూరు వంతెన కొట్టుకుపోయింది. దెబ్బతిన్న వంతెనకు తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేశారు. రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆ అప్రోచ్ రోడ్డు కూడా కోతకు గురైంది.
దీంతో సిరికొండ మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ధర్పల్లి మండలం వాడి వద్ద ముత్యాలమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటు బాల్కొండ నియోజక వర్గం ఏర్గట్ల మండలంలో కురుస్తున్న వర్షానికి తీగల వాగు ఉప్పొంగి పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. నిజామాబాద్ నగరంలో సైతం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించింది. రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల ముందర ఉన్న డ్రైనేజీలు పొంగి వరదతో మురుగు నీరు రోడ్లపైకి వచ్చి బురదమయంగా మారిపోయాయి.

