కలం, హనుమకొండ : మాదిగల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ (Vangapalli Srinivas) అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం హనుమకొండలోని హరిత హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో మాదిగలు అధిక జనాభా కలిగిన వర్గమైనప్పటికీ విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 32 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సాగిన ఉద్యమం విజయవంతమైందని, ఆ విజయం ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు అంకితమని తెలిపారు. ఉద్యమాల ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ వర్గీకరణ సాధించగలిగామని పేర్కొన్నారు. రిజర్వేషన్ల హక్కుల కోసం సాగిన పోరాటం పూర్తయిందని, ఇకపై రాజ్యాధికారంలో మాదిగలకు సముచిత భాగస్వామ్యం కల్పించే దిశగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్యాధికారం లేని సామాజిక వర్గాలు చరిత్రలో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్న వంగపల్లి శ్రీనివాస్ (Vangapalli Srinivas), రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాదిగలు రాజకీయంగా మరింత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకు దీటుగా మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో వాటా కోసం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు నమిండ్ల చిన్నస్వామి, ఎదనూరి యాకన్న, పందుల సంజీవ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకటేష్, రాష్ట్ర నాయకులు రామంచ సారన్న, గడ్డం బద్రన్న, అంజన్న, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కుమార్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేణుకుంట మహేష్, కొంగర స్వామి, కొమ్ముల యోశోభు, వెంకన్న, ఉట్ల మోహన్, గడ్డం శ్యామ్, మీసాల విజయ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణలో కొత్త అవార్డు.. ఇదే మొదటిసారి!
Follow Us On : WhatsApp

