కలం, జోగుళాంబ గద్వాల: బైక్ ను కారు ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జోగుళాంబ గద్వాల (Gadwal Accident )జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గద్వాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సునీల్(24) అనే యువకుడు గద్వాలలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో టెక్నిషియన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆసుపత్రి డ్యూటి అనంతరం పార్ట్ టైమ్ జాబ్ గా ర్యాపిడో సంస్థలో రైడర్గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఒక వ్యక్తి గద్వాలలో డ్రాపింగ్ కోసం ర్యాపిడో బుక్ చేసుకోవడంతో ఫికప్ కోసం గద్వాల రైల్వే స్టేషన్ వైపు తన బైక్ పై బయలుదేరాడు. అయితే గద్వాల ప్లైఓవర్ మీదుగా రైల్వేస్టేషన్ వెళ్తున్న క్రమంలో సునీల్ నడుపుతున్న బైక్ ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. బైక్ పై ఉన్న సునీల్ కిందపడగా తీవ్రగాయాలవడంతో స్థానికులు అతన్ని గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించే సమయంలో మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గద్వాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్లై ఓవర్ మీదుగా రైల్వే స్టేషన్ వెళ్తున్న బైక్ ను అయిజ నుండి గద్వాల్ వైపుకు వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు అంటున్నారు.

