కలం, మహబూబ్నగర్ బ్యూరో: దేశంలో పెరుగుతున్న విద్వేష రాజకీయాల నేపథ్యంలో ఓ వర్గం వారు నిర్మించిన సంస్థ అనే కారణంతో వేలాది మంది పేద, మూలవాసి, మైనారిటీ విద్యార్థులు చదువుకుంటున్న జౌహర్ యూనివర్సిటీని(Jauhar University) కూల్చివేయాలనే ప్రయత్నాలను సహించబోమని సామాజికవేత్త, తెలంగాణ ఉద్యమకారుడు హనీఫ్ అహ్మద్ (Haneef Ahmed) హెచ్చరించారు.
శనివారం మహబూబ్నగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలు కేవలం రాళ్లు, గోడల సముదాయం కాదని.. అవి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే పునాదులని అన్నారు. గత కొన్నేళ్లుగా మైనారిటీలపై జరుగుతున్న అణిచివేత, విభజించి పాలించే రాజకీయాలను ప్రజలంతా ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలు, మతాలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం విద్యా సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
జౌహర్ యూనివర్సిటీ అంశంపై విపక్ష నాయకులంతా ఏకమై పార్లమెంట్లో ప్రశ్నించాలని ఆయన కోరారు. ఇది విద్యా హక్కును ప్రభావితం చేసే అంశమని పేర్కొంటూ, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు కూడా స్పందించాలని కోరారు. బుల్డోజర్ రాజకీయాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని, విద్యా సంస్థలు సమాజానికి ఆస్తులని అనీఫ్ అహ్మద్ అన్నారు. జౌహర్ యూనివర్సిటీ పరిరక్షణ కోసం దేశ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావంతులు మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

