కలం, వెబ్ డెస్క్ : న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులు సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (Delhi Police FRS) ద్వారా నేర చరిత్ర కలిగిన 2,500 కంటే ఎక్కువ మంది వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష కెమెరా ఫీడ్లను పోలీసుల అధికారిక డేటాబేస్తో అనుసంధానించడం ద్వారా గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణ నిరసనకారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని, కేవలం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్తులు, పరారీలో ఉన్న నిందితులను ఏరిపారేయడానికే ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
వివాదాస్పద రాతలు..
జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న నీట్ పరీక్షల అక్రమాల నిరసనల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆందోళనకారులు ఒక్కసారిగా ‘ఆజాద్ కశ్మీర్’ అంటూ వివాదాస్పద నినాదాలు చేయడం, గోడలపై రాయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల అక్రమాల పోరాటంలో ఇలాంటి దేశ వ్యతిరేక నినాదాలు ఎందుకంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు సమస్యలను పక్కనబెట్టి, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఆందోళనల దిశను మార్చడం సరికాదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

