కలం, బూర్గంపాడు: ఎల్ నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఈ ఏడాది వరి పంటను నాటుకోకపోవడమే మంచిదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం బృందం ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిక చేశారు. శనివారం బూర్గంపాడు (Burgampadu) మండలం సోంపల్లి పంచాయతీ పరిధిలోని ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి పొలంలో పచ్చిరొట్ట ఎరువులను కలియదున్నే కార్యక్రమం నిర్వహించారు.
ఇలా చేస్తే అధిక దిగబడులు..
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులకు వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. పచ్చిరొట్టను భూమిలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనం పెరిగి, చీడపీడల భయం లేకుండా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఎల్ నినో వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. వరికి బదులుగా తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో పండే కంది, పెసర, బొబ్బర వంటి స్వల్పకాలిక పంటలను లేదా వెదజల్లే పద్ధతిని ఎంచుకోవాలని కోరారు. కేవీకే ప్రతినిధి భరత్, వ్యవసాయ అధికారులు ఏడీఏ తాతారావు, ఏవో శంకర్, ఏఈఓలు పవన్, వైష్ణవి, ఎస్బీఐ ప్రతినిధి కవి రాజు పాల్గొన్నారు.

