కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గజ్వేల్ లోనే ఆయన్ను రాజకీయ సమాధి చేస్తామని.. మరోసారి అధికారంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబానికి ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. పాస్ పోర్ట్ బ్రోకర్ ను ప్రజలు తెలంగాణ సీఎంను చేశారని ధ్వజమెత్తారు.
తులసివనం లాంటి తెలంగాణలో వాళ్లు గంజాయి మొక్కలని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. పెట్రోల్ పోసుకున్న వ్యక్తి, అగ్గి పుల్ల కూడా అంటించుకుంటే బాగుండేదన్నారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే వ్యక్తి.. మంత్రి అయ్యాడన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరైనా అమరుడు అయ్యారా.. అని ప్రశ్నించారు.
నిజాం కంటే ఎక్కువ ఆస్తినా..
పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను విపరీతంగా దోచుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు ఎలా చేశారని.. నిజాంలకు లేని ఆస్తి.. మీకు ఎలా వచ్చిందని, మీ బతుకెంత అని విమర్శలు గుప్పించారు.
గంజికి గతి లేని కేసీఆర్కు వందల ఎకరాల్లో గజ్వేల్ ఫాంహౌస్, కేటీఆర్కు జన్వాడ ఫాం హౌస్, హరీశ్ రావు మెయినాబాద్ ఫాంహౌస్, కవితకు శంకర్ పల్లి ఫాంహౌస్ ఎలా వచ్చాయన్నారు. నిజాం మూడో తరం వచ్చేసరికి ఆస్తులే మిగలలేదని.. కేసీఆర్ కుటుంబం కూడా భిక్షమెత్తుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందె శ్రీ మళ్లీ పుడతాడు..
తెలంగాణను ఎవరూ దోచుకోవాలని చూసినా.. అందె శ్రీ పాట రూపంలో మళ్లీ పుడతాడని సీఎం రేవంత్ భావోద్వేగంగా చెప్పారు. గద్దర్, అందె శ్రీల స్ఫూర్తి తమలో ఉంటుందని.. వారి ఆలోచనలకు అనుగుణంగానే పరిపాలన సాగిస్తున్నట్లు వివరించారు. అసలు కేసీఆర్, తమకు పోలిక ఏంటన్నారు. కేసీఆర్ దోపిడీని ఎవరూ మర్చిపోరన్నారు.

