కలం, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా చందుర్తి మండలం బండపల్లి జెడ్పీహెచ్ఎస్ (Bandapalli ZPHS) పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, సీనియర్ ఉపాధ్యాయుడి మధ్య విభేదాలు ఘర్షణకు దారితీసాయి. బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, సీనియర్ ఉపాధ్యాయుడి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ను కాదని జూనియర్కు బాధ్యతలు అప్పగిస్తున్నారనే అంశంపై ఇప్పటికే వివాదం కొనసాగుతుంది.
కాగా.. తాజాగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లో సంతకం చేసే విషయంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. హాజరు నమోదు చేసేందుకు వెళ్లిన తనను ప్రధానోపాధ్యాయుడు అడ్డుకున్నారని ప్రశ్నించగా తనపై దాడికి యత్నించారని సీనియర్ ఉపాధ్యాయుడు రామచంద్రం ఆరోపించారు. మరోవైపు ఈ వివాదం తీవ్రరూపం దాల్చి ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరువురు ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రమేష్ విచారణ ప్రారంభించారు.

