కలం, వెబ్ డెస్క్ : నందమూరి తారక రామారావు అభిమానులు చేసినంత సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మరెవ్వరూ చేయలేదని, ఆయన తలదించుకునే పని గానీ, పేరు చెడగొట్టే పని గానీ తాము ఎప్పటికీ చేయమని ‘RAW NTR’ ఆర్గనైజర్ సాయి రూప్ స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
తమ వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని, తాము ఇతరులకు బీ-టీమ్గా వ్యవహరిస్తున్నామంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమ వెనుక ఎవరూ లేరని, కేవలం హీరో పట్ల ఉన్న ప్రేమ, ప్రజల మేలు కోసమే స్వచ్ఛందంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున జరిగినంత మాత్రాన వెనుక ఎవరో ఉన్నారని అనుకోవడం సరికాదన్నారు. హీరో వద్దకు వెళ్లకుండా భయపడటానికి తమపై జరుగుతున్న దుష్ప్రచారమే కారణమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ మమ్మల్ని అంత దూరంగా ఎందుకు ఉంచుతున్నారో తనకు తెలియదని, మేము టెర్రరిస్టులం కాదు.. మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవు అని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ని ఒక్కసారి కలిసే అర్హత కూడా తమకు లేదా అని ఆయన ప్రశ్నించారు. గత 7 సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ను కలవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయనను కలిసి మా సేవా కార్యక్రమాల గురించి వివరించాలనేది తమ లక్ష్యం అని పేర్కొన్నారు.
తమది రిజిస్టర్డ్ ఎన్జీవో (RAW NTR) అని, ఎన్టీఆర్ పేరు చెప్పి తాము ఎలాంటి ఫండ్స్ సేకరించడం లేదని సాయి రూప్ వెల్లడించారు. కేవలం సీఎస్ఆర్ నిబంధనల ప్రకారమే కార్పొరేట్ సపోర్ట్ కోరుతున్నామని, ఇందులో ప్రతి రూపాయి ఆడిట్ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరు చెడగొట్టే పని కలలో కూడా చేయనని చెప్తూ, ఈ ప్రక్రియలో ఆవేశంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే, ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి క్షమించాలని ఆయన కోరారు.
Read Also : ‘వారణాసి’ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది!
Follow Us On: Instagram

