కలం, వనపర్తి: ఈ నెల 18న నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సదస్సు’ ను (Yuva Sangrama Sabha) నిరుద్యోగ యువత విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరుతో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, 30 నెలలు గడిచినా నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని అమలు చేయలేదన్నారు. పేరుకే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీల వివరాలు ప్రకటించకుండా యువతను మోసం చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. నిరుద్యోగులందరినీ సంఘటితం చేసి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఒత్తిడి తీసుకురావడమే ‘యువ సంగ్రామ సదస్సు’ (Yuva Sangrama Sabha) లక్ష్యమని తెలిపారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తారని చెప్పారు.
Read Also: ఒకటి తీరేలోపే మరొకటి.. సర్కారు సతమతం!
Follow Us On: Sharechat

