కలం, కరీంనగర్ బ్యూరో : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు రూ. 3 కోట్ల నిధులతో బంధంపల్లి చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా నిర్మాణం చేపడుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు (Vijaya Ramana Rao) తెలిపారు. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
చెరువు కట్ట వద్ద మరింత సుందరంగా ఉండేందుకు తీగల వంతెన కూడా నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మినీ ట్యాంక్ బండ్ పనులను నాణ్యతగా చేపట్టాలని నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పని చేయాలని గుత్తేదారునికి సూచించారు. పెద్దపల్లి ప్రజలకు రానున్న రోజుల్లోనే మినీ ట్యాంక్ బండ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
పెద్దపల్లి పట్టణాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని విజయరమణ రావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నుగుల్లా మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, స్థానిక కౌన్సిలర్ పురేళ్ళ శైలజా సుధాకర్, ఇరిగేషన్ అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

