కలం, వెబ్ డెస్క్ : దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన ఒక భారీ కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (Gujarat ATS) భగ్నం చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు, నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఎ-మహమ్మద్ (JeM)తో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిని బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడియవాల్ అలియాస్ మహమ్మద్ ఖాదియాసన్, మహమ్మద్ షఫీ ముఖీ అలియాస్ షఫీ చాపీ, మహమ్మద్ హసన్ కరాడియా అలియాస్ హసన్ హైదర్పురి, అలాగే మహమ్మద్ అయూబ్ సునసారా అలియాస్ మహమ్మద్ ఖలీలుగా అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ బృందాలు ఈ నెట్వర్క్ను గుట్టురట్టు చేశాయి. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వెనుక ఉన్న శక్తులు, ప్రణాళికలపై అధికారులు లోతుగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

