కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు (Manuguru) మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంత్రుల పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు(Electric Shock Accident) గురై ఓ యువకుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఎడుల్ల బయ్యారానికి చెందిన సిరిగడ్డే సంతోష్ బాలాజీ ఫ్లెక్సీ షాప్ నిర్వహిస్తున్నాడు. మంత్రుల పర్యటన సందర్భంగా గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో తోగూడెం సమ్మక్క–సారలమ్మ ఆలయం సమీపంలో ఫ్లెక్సీలు కట్టే పనిలో నిమగ్నమయ్యాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో సంతోష్ తీవ్ర విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది, స్థానికులు స్పందించి అతడిని మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెంలోని నాగరాజు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇటీవలే సంతోష్ తండ్రి కృష్ణమూర్తి మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఆ బాధ నుంచి తేరుకోకముందే కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్న సంతోష్ ఆస్పత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

