కలం, దేవరకొండ: దేవరకొండ పట్టణంలో రూ.9 కోట్లతో నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గురువారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, స్థల పరిశీలన చేపట్టారు. మొదటగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం కోసం ఖిల్లా బజార్ (పాత బజార్)లోని పాత పోలీస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చూసి.. ఏది అనుకూలంగా ఉంటుందనే అంశంపై అధికారులతో చర్చించారు.
ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ సందర్శించారు. అక్కడ నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, స్థల లభ్యత, కల్పించాల్సిన వసతులపై తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
త్వరలోనే పనులు ప్రారంభం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. దేవరకొండ పాత బజార్ రూపురేఖలను మార్చేలా, ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. అత్యాధునిక హంగులతో మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రూ.7.60 కోట్లు, నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 2.25 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.
త్వరలోనే పనులు ప్రారంభించి, వీలైనంత వేగంగా పూర్తి చేయిస్తామన్నారు. ఈ భవనాల నిర్మాణం పూర్తయితే నియోజకవర్గ ప్రజలకు ఒకే చోట అన్ని కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని.. చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

