కలం, వెబ్ డెస్క్: వైసీపీ హయాంలో సంచలనంగా మారిన ఇసుక స్కామ్ (AP Sand Mining Scam)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఇసుక రవాణా విధానంలో సాగించిన దోపిడీపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాకు చెందిన దండా నాగేంద్రకుమార్ను హైదరాబాద్లోని ఆఫీస్ లో సుదీర్ఘంగా విచారించి పలు వివరాలు సేకరించింది.
అయితే నాగేంద్రకుమార్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఆధారాలే ఈడీకి కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. అక్రమ ఇసుక స్కామ్ లో రూ.2,566 కోట్లు దోచేసినట్లు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) గుర్తించింది. దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. మరోసారి విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. 2019-24 వరకు ఇసుక తవ్వకాల్లో ఎన్ని రకాలుగా అక్రమాలు జరిగాయి? ఈ అక్రమ తవ్వకాల డబ్బంతా ఎవరెవరికి చేరాయి? అనే అనే కోణాల్లో ఈడీ విచారించనుంది.

