కలం, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ (Nirmal Congress) మండల అధ్యక్షుల నియామకాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయా మండలాల్లో కన్వీనర్లుగా కీలక బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో మండల అధ్యక్ష పదవులు అప్పగించడం పార్టీ అంతర్గతంగా చర్చకు దారితీసింది. సోన్ మండల అధ్యక్షుడిగా షేక్ మొహినొద్దీన్, దిలావర్పూర్ మండల అధ్యక్షుడిగా దేవేందర్ రెడ్డి, సారంగాపూర్ మండల అధ్యక్షుడిగా మాధవరావును కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది.
అయితే వీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో దాదాపు పదేళ్లపాటు మండల కన్వీనర్లుగా పనిచేసి, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న క్లిష్ట సమయంలో పార్టీ జెండాను మోసిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు వస్తాయని ఆశించిన వారికి ఈ నిర్ణయం నిరాశ కలిగించిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ (Nirmal Congress) కోసం కష్టపడిన వారికి కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన వారికి కీలక బాధ్యతలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం.
రాజకీయాల్లో పార్టీ మారడం కొత్త విషయం కాకపోయినా, విధేయంగా పనిచేసిన వారికంటే కొత్తగా చేరిన వారికి వెంటనే కీలక పదవులు ఇవ్వడం సరైన సందేశం కాదని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీ శ్రేణుల మనోభావాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మరోవైపు, అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నియామకాలు జరిగి ఉండవచ్చని కాంగ్రెస్ నాయకత్వాన్ని సమర్థించే వర్గాలు చెబుతున్నాయి.
Read Also: హోమ్వర్క్లో ‘కల్మా’..సైదాబాద్ స్కూల్లో తీవ్ర వివాదం!
Follow Us On : WhatsApp

