కలం, స్పోర్ట్స్ : 2027 వన్డే ప్రపంచకప్కు ఐసీసీ కొత్త ఫార్మాట్ (ICC World Cup Format)ను ప్రకటించింది. ఈ మార్పులతో భారత్-పాకిస్థాన్ మూడు సార్లు తలపడే అవకాశం కనిపిస్తోంది. అదే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ఈ ప్రపంచకప్లో 14 జట్లు పాల్గొంటాయి. అయితే టోర్నీ నిర్మాణంలో కీలక మార్పులు చేశారు. అర్హత సాధించిన జట్లలో చివరి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ముందుగా ప్రిలిమినరీ రౌండ్ ఆడతాయి.
అందులో ఒక్క జట్టు మాత్రమే ప్రధాన టోర్నీకి చేరుతుంది. ప్రధాన దశలో 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. గతంలో ఉన్న ‘సూపర్-6’ స్థానంలో ఇప్పుడు ‘సూపర్-7’ దశను తీసుకొస్తున్నారు. అయితే ఈసారి క్వార్టర్ ఫైనల్స్ ఉండవు. ఈ కొత్త ఫార్మాట్తో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉంటే లీగ్ దశలో ఒకసారి, సూపర్-7లో మరోసారి, ఆ తర్వాత సెమీఫైనల్ లేదా ఫైనల్లో ఇంకోసారి తలపడే అవకాశం ఉంది.
అలాగే 2028 టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. టోర్నీలో 20 జట్లు కొనసాగుతాయి. అయితే గ్రూప్ దశ నుంచి 10 జట్లు ‘సూపర్-10’కు చేరతాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు బెర్త్ల కోసం కొత్త ఎలిమినేటర్ దశను నిర్వహించనున్నారు. ఈ మార్పులతో టోర్నీలు మరింత పోటీతత్వంగా, ఆసక్తికరంగా మారుతాయని ఐసీసీ భావిస్తోంది.

