కలం, జోగులాంబ గద్వాల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, తన తల్లిదండ్రులు వద్దంటున్నారనే నెపంతో ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఓ నవవధువు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. గద్వాల్ మండలం అనంతపురం గ్రామానికి చెందిన యువకుడు, గద్వాలకు (Gadwal) చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. మంగళవారం బీచుపల్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత బుధవారం అబ్బాయి తన భార్యను స్వగ్రామమైన అనంతపురానికి తీసుకెళ్లాడు. అక్కడ అబ్బాయి తల్లిదండ్రులు నిరాకరిస్తూ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. తల్లిదండ్రులు వద్దంటున్నారని భర్త కూడా చెప్పడంతో బాధితురాలు భర్త ఇంటి ముందే నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది.

