కలం, వెబ్ డెస్క్ : థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో(Bangkok) ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ పబ్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందగా.. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్ సమీపంలోని చటుచక్ జిల్లా ఛోమ్ ఫోన్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే రాంగ్ బీర్ నా లాట్ ఫ్రావో పబ్లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం కావడంతో పబ్కు స్థానికులతో పాటు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. అర్ధరాత్రి సమయంలో పబ్లో సందడి నెలకొన్న వేళ.. రాత్రి 11:57 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి భయానక పరిస్థితి నెలకొంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో బయటకు వచ్చే అవకాశం లేక పలువురు ఊపిరాడక, తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే థాయ్లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ (Anutin Charnvirakul) ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉండి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు మంటలను అదుపు చేసి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పబ్లో అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలపై విచారణ కొనసాగుతోంది.

