కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన, ఆదివాసీల హక్కులను రక్షించాల్సిన భద్రాచలం (Bhadrachalam) ఐటీడీఏ కార్యాలయం అటవీ అధికారులు, గిరిజనేతరులకు కొమ్ముకాస్తోందని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ.. ఆదివాసీల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో సోమవారం ‘చలో ఐటీడీఏ పీవో ఆఫీస్’ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. అయినా స్పందించకుంటే హైదరాబాద్లోని చీఫ్ కన్జర్వేటర్ ఆఫీస్ వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కార్పొరేట్లకు తొత్తులుగా మారి..
పోడు భూముల్లో జామాయిల్ మొక్కలు నాటుతూ కార్పొరేట్ కంపెనీలకు ఐటీడీఏ అధికారులు తొత్తులుగా మారారని ముసలి సతీష్ ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం, పెసా చట్టం ప్రకారం లభించిన ఆర్ఎఫ్ఓఆర్ పట్టాల భూములను ఫారెస్ట్ అధికారులు అక్రమంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. అమాయక ఆదివాసీలపై అక్రమ కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు మట్ట నరసింహారావు, కుంజ జోగారావు, రమేష్, సమ్మక్క, లక్ష్మి, రాధ పాల్గొన్నారు.

