కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భుజానికి సర్జరీ విజయవంతంగా జరిగింది. ముంబైలోని ఆసుపత్రిలో ఆయన కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై వైద్యులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల్లో వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.
అయితే పవన్ కళ్యాణ్ను వేధిస్తున్న ఈ భుజాల నొప్పి 2016 నుంచి ఉంది. 2016లోనే ఆయన భుజానికి మొదటిసారి గాయమైంది. అయినప్పటికీ ఆయన ప్రజాక్షేత్రంలో బిజీగా ఉన్నారు. 2018లో పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర సమయంలో ఆయన గాయాల తీవ్రత మరింత ఎక్కువైంది. ఆ తర్వాత జరిగిన వారాహి యాత్ర, మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లోనూ అభిమానులు చేతులు పట్టి లాగడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాథమిక చికిత్సలతోనే సరిపెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్కు ముక్కుకు సంబంధించిన సర్జరీ జరిగినప్పుడు ఆయన భుజాల పరిస్థితిని కూడా వైద్యులు పరీక్షించారు. దీంతో ఆయన రెండు భుజాల రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. సర్జరీ తప్పనిసరి అని వైద్యులు తేల్చారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఆసుపత్రికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు సర్జరీ అయింది. అయితే ఒకేసారి రెండు భుజాలకు ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ చేసిన వైద్యులు.. రెండు నెలల్లో ఎడమ భుజానికి సర్జరీ చేయనున్నారు.

