కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ నర్సింగ్, మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) హాజరుపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. డిగ్రీ, పీజీ విద్యార్థులు తప్పకుండా ప్రతి రోజు ‘మీ ప్రమాణం’ యాప్లో అటెండెన్స్ వేయాలని ఆదేశించింది. వీరితో పాటు కాలేజీల్లో పనిచేస్తున్న పరిపాలన, పారామెడికల్, నర్సింగ్ విభాగాల్లోని శాశ్వత, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు విధిగా హాజరు సమర్పించాలని సూచించింది.
ప్రతి వ్యక్తికి లాగిన్ ఐడీ..
హాజరు ప్రక్రియను పర్యవేక్షించేందుకు గాను ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు లేదా డైరెక్టర్లని జిల్లా నోడల్ అధికారులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియమించింది.
వీరు తమ పరిధిలోని మెడికల్ కాలేజీలు, జనరల్ ఆసుపత్రులు, నర్సింగ్ కాలేజీలు, స్కూళ్లలో ప్రతి ఒక్కరికి లాగిన్ ఐడీ క్రియేట్ చేసేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థి, అధికారి, సిబ్బంది.. ఇలా వ్యక్తి హోదా, గుర్తింపును కచ్చితంగా పేర్కొనాలని సూచించింది.
హాజరు నమోదులో తేడా ఉండొద్దు..
లాగిన్ ఐడీలు క్రియేట్ చేశాక.. యాప్లో రోజువారీ హాజరును నోడల్ అధికారులు పర్యవేక్షిస్తుండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. సంబంధిత అధికారులకు కూడా జిల్లా నోడల్ అధికారుల లాగిన్ ఐడీ వివరాలను తెలియజేయాలని కోరింది.
సాంకేతికత ఇబ్బందులు ఎదురైతే ఎఫ్ఎంఎస్ ఇంజినీర్లకు వెంటనే సమాచారం అందించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అన్ని కాలేజీల్లో ఒకేసారి, ఒకే తరహాలో జరగాలని.. వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

