కలం, సినిమా : రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ (Fauji Movie Shoot) సందర్భంగా ప్రముఖ నటుడు రాజేశ్ శర్మ (Rajesh Sharma) ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
చిత్రీకరణ పూర్తైన అనంతరం సెట్స్లో టెక్నీషియన్లతో మాట్లాడుతున్న సమయంలో ఆయన కుడికాలి పాదాన్ని ఓ విషపురుగు కుట్టినట్లు తెలుస్తోంది. మొదట దీనిని సాధారణ పురుగు కాటుగా భావించి పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ, దాదాపు ఆరు గంటల తర్వాత తీవ్ర నొప్పితో పాటు జ్వరం రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నుంచి కోల్కతాకు బయలుదేరిన రాజేశ్ శర్మకు విమాన ప్రయాణం సమయంలోనే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన రక్తంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగడంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. కోల్కతా చేరుకున్న వెంటనే ఆయనను అక్కడి ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.
విషపురుగు కాటు కారణంగా ఏర్పడిన ఇన్ఫెక్షన్ పాదం నుంచి మోకాలి వరకు వేగంగా వ్యాపించినట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. జ్వరం కూడా అదుపులోకి రాకపోవడంతో ఆయనను ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. రాజేశ్ శర్మ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆకాంక్షిస్తున్నారు.

