కలం మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మనోవేదనతో తల్లి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. హవేళి ఘనపూర్ మండలం ముత్తాయికోట గ్రామానికి చెందిన వంగాల భారతి (60), కుమారుడు వంగాల శ్రీకాంత్ చారి (40) బలవన్మరణానికి పాల్పడ్డారు. భారతి గత నెలలో పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యారు. కుమారుడు శ్రీకాంత్ చారి సపర్యలు చేయాల్సి వస్తోంది. మరోవైపు శ్రీకాంత్ చారికి వివాహమైనా.. భార్య కొన్ని సంవత్సరాలుగా కాపురానికి రావడం లేదు. ఇటు పక్షవాతంతో తల్లికి సేవ చేసేవారు లేకపోవడం, అటు భార్య రాకపోవడంతో ఇద్దరు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి కుమారుడు మరణించడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

