కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) గురువారం కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించిన ఆయన, విధుల నిర్వహణ షిఫ్టుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం ప్రసూతి వార్డు, జనరల్ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యత, సిబ్బంది స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం. రాధామోహన్, డీవైసీఎస్ఆర్ఎంఓ సీతారాం, ఆర్ఎంఓ చైతన్య, తహశీల్దార్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

