కలం, వెబ్డెస్క్: గురుకులాల్లో టెండర్లలో అవినీతి జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ రాష్ట్ర మంత్రులు (Telangana Ministers) చర్చకు సిద్ధమయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ గురువారం ఉదయమే గన్పార్క్కు చేరుకున్నారు. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా గురుకులాల టెండర్లపై చర్చకు సిద్ధమని ముందుకొచ్చారు. వారి వెంట కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్నారు. ముందుగా తమపై ఆరోపణలు చేసిన హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR)లతో పాటు కేసీఆర్ కూడా తమతో చర్చకు రావాలని మంత్రులు సవాల్ విసిరారు.
హరీశ్ రావు ముందు ఈ సవాళ్లను మొదలు పెట్టారని, ఆయనే ముందు రావాలని మంత్రులు పేర్కొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద కూర్చొని చర్చకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ గురుకులాల టెండర్లతో పాటు బీఆర్ఎస్ చేసిన అవినీతి, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపైనా చర్చించేందుకు సిద్ధమన్నారు. తాము అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఆరోపణలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి, క్షమాపణ చెప్పి, తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. మరోవైపు గురుకులాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ క్లబ్కు వెళ్లనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

