కలం, ఖమ్మం బ్యూరో : ‘ప్రతి ఇంటికి పట్టా.. ప్రతి కుటుంబానికి ఇల్లు’ అనే నినాదంతో నిరుపేదల గూడు కోసం వామపక్షాలు ప్రారంభించిన ఉద్యమం లక్ష్యం నెరవేరే వరకు ఆగబోదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni ) స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం, న్యూ డిమోక్రసీ, మాస్ లైన్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది పేదలతో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) మాట్లాడుతూ.. కొత్తగూడెం పట్టణ పరిధిలో జీవో నెంబర్ 76ను పూర్తిస్థాయిలో అమలు చేసి అర్హులైన నిరుపేదలందరికీ తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాల్వంచ పరిధిలోని వివిధ జీవోల పరిధిలో దశాబ్దాలుగా నివాసముంటున్న స్థలాలను తక్షణమే క్రమబద్ధీకరించి, నిరుపేదలకు చట్టబద్ధమైన హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం. సాయిబాబు మాట్లాడుతూ.. పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతలను తక్షణమే మానుకోవాలని, ప్రభుత్వ నిరంకుశ చర్యలను నిరుపేదలంతా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎస్.కె. సాబీర్ పాషా, మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పేదల ఇండ్లకు వెంటనే ఇంటి నెంబర్లు జారీ చేసి, తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించాలన్నారు.
గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని న్యూ డిమోక్రసీ, మాస్ లైన్ నాయకులు గౌని నాగేశ్వరరావు, కెచ్చల రంగారెడ్డి హెచ్చరించారు. ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో వామపక్షాల రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు వేలాది మంది నిరుపేదలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: వాట్సాప్ ‘యూజర్నేమ్ ఫీచర్’పై కేంద్రం అలర్ట్..!
Follow Us On : WhatsApp

