కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్–మల్కాజిగిరి (Medchal-Malkajgiri) జిల్లా అల్వాల్(Alwal) మండలం మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట ఔట్లెట్ నాలాలో హైడ్రా (HYDRAA) డీఆర్ఎఫ్, మాన్సూన్ రెస్పాన్స్ బృందాలు పూడిక తొలగింపు పనులు చేపట్టగా గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాలాలో పేరుకుపోయిన చెత్తను జేసీబీతో తొలగిస్తుండగా చెత్తతో పాటు మృతదేహం బయటకు వచ్చింది. భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త మధ్య ఈ మృతదేహం ఉండటాన్ని సిబ్బంది గుర్తించి వెంటనే అల్వాల్ పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ఎముకలకు శరీరం అతుక్కుపోయిన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతదేహం సుమారు 15 రోజుల క్రితం నాటిదై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: వాట్సాప్ ‘యూజర్నేమ్ ఫీచర్’పై కేంద్రం అలర్ట్..!
Follow Us On: Sharechat

