కలం, వెబ్ డెస్క్ : ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో జరిగిన మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచనప్రాయంగా తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో (Assembly Winter Session)లో గోదావరి కృష్ణా జలాల అంశం ప్రధాన ఎజెండాగా ఉండనున్నది. లాంఛనంగా అసెంబ్లీ సెషన్ డిసెంబరు 29న ప్రారంభమైన తర్వాత 30, 31, జనవరి 1 తేదీల్లో సెలవు ప్రకటించి తిరిగి జనవరి 2 నుంచి చర్చలు నిర్వహించేలా సమావేశాల ప్రాథమిక షెడ్యూల్ రూపొందుతున్నది. కృష్ణా, గోదావరి జలాలపై కేసీఆర్ కామెంట్లు చేయడంతో అసెంబ్లీ వేదికగానే వాస్తవాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ సెషన్లో ఏయే అంశాలపై చర్చ?
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి వాటాలు, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా ఆ రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులు, వాటిని అడ్డుకునేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ రూపొందించిన డీపీఆర్ను కేంద్రం తిప్పి పంపడం, దాని స్థానంలో ఏపీ కొత్తగా తెరమీదకు తెచ్చిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, గత ప్రభుత్వ హయాంలో ఏపీతో కుదిరిన తాత్కాలిక నీటి ఒప్పందాలు, ఆ రాష్ట్రం తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్.. ఇలాంటివన్నీ శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం చర్చకు తేనున్నది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తదితరాలపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎండగట్టాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన మంత్రుల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
అసెంబ్లీ సమావేశాలకు సారొస్తారా?
తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ (KCR) పైనే ఉంది. దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ విడిచి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులపై బీఆర్ఎస్ అధినేత నిప్పులు చెరగడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కామెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ వేదిక చర్చకు రావాలంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ‘నేను వస్తున్నా’ అంటూ కేసీఆర్ గర్జించడం ఆ తరువాత ఫామ్ హౌజ్కే పరిమితం కావడం ఆనవాయితీగా మారిందని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.
మీడియా సమావేశంలో కేసీఆర్.. మరోసారి ‘నేను వస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం తోలు తీస్తా’ అంటూ హెచ్చరించిన నేపథ్యంలో డిసెంబర్ 29న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? అనే ప్రశ్న మొదలయింది. మీడియాతో కాకుండా చట్ట సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చూడాలని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు యావత్తు తెలంగాణ ఎదురుచూస్తోంది. మరి ఈసారైనా Telangana Assembly సమావేశాలకు ‘సారోస్తారా’ లేదా చూడాలి.


