కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లా కట్టంగూరు (kattangur) మండలం ముత్యాలమ్మగూడెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో అదుపుతప్పింది. దీంతో బస్సు డివైడర్ను దాటుకుంటూ అవతలి వైపునకు దూసుకెళ్లి, ఎదురుగా వస్తున్న ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. బస్సు క్యాబిన్లోనే డ్రైవర్ తీవ్ర గాయాలతో ఇరుక్కుపోయాడు.
అలాగే ట్యాంకర్ డ్రైవర్ కూడా క్యాబిన్లో చిక్కుకుపోగా, అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ సహాయంతో క్యాబిన్ భాగాలను తొలగించి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బస్సు డ్రైవర్ను, ట్యాంకర్ డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో ఇంటర్సిటీ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులందరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

