కలం, వెబ్ డెస్క్: పర్యాటకం, సృజనాత్మక పరిశ్రమల రంగాల్లో కొరియాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) స్పష్టం చేశారు. సచివాలయంలో భారత్లోని కొరియన్ కల్చరల్ సెంటర్ (KCCI) డైరెక్టర్, కొరియా రాయబార కార్యాలయం కల్చర్ అండ్ ప్రెస్ కౌన్సిలర్ హ్వాంగ్ ఇల్యాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృంద సభ్యులు సోమవారం మంత్రితో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 25న హైదరాబాద్లో తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహణపై చర్చించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, వారసత్వ పరిరక్షణ, పర్యాటక ప్రోత్సాహం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వం, సంప్రదాయ కళారూపాలు, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిందని కొనియాడారు. ప్రతిపాదిత మహోత్సవం ద్వారా ఇరు ప్రాంతాల కళలు, సంగీతం, నృత్యం, వంటకాలు, సంప్రదాయాలను ఒకే వేదికపై ఆవిష్కరించే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఇండియాలో, ముఖ్యంగా యువతలో కొరియన్ కే-డ్రామాలు, కొరియన్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు ఓటీటీ వేదికల ద్వారా విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు.

