Mobile Popup Ad
Mobile Popup Ad

ప్లాన్ చేసి టీమిండియాను దెబ్బకొట్టిన జై ముంద్రా

కలం, స్పోర్ట్స్: భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయంలో భారత సంతతికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జై ముంద్రా  (Jai Mundra) ఐదు వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రెండో టీ20లో 32 పరుగులకే 3 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. నిజానికి ముంద్రా ఈ సిరీస్‌కు ముందు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఔట్ చేయడానికి వారం రోజుల పాటు ప్రత్యేక వ్యూహాలు రచించాడు. అయితే, భారత జట్టు యాజమాన్యం పాత కాంబినేషన్‌తోనే వెళ్లడంతో వైభవ్‌కు ఆడే అవకాశం రాలేదు. కానీ, వైభవ్ కోసం చేసిన కఠిన సాధన వృథా పోలేదు. కొత్త బంతితో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే వంటి స్టార్ ఆటగాళ్ల వికెట్లు తీసి ముంద్రా భారత్‌ను దెబ్బకొట్టాడు.

ఇంజనీరింగ్ విద్యార్థి నుండి నెట్ బౌలర్ వరకు..

రాజస్థాన్‌లోని టోంక్‌లో జన్మించిన జై ముంద్రా (Jai Mundra) ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. 2018లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో జై.. జైపూర్‌లోని సీమా స్పోర్ట్స్ క్లబ్‌లో కోచ్ మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లాడు. తనకు బంతి లోపలికి స్వింగ్ అవ్వడం లేదని, దాన్ని సరిచేయాలని కోరాడు. ఆ తర్వాత మూడేళ్ల పాటు కోచ్ మోహన్ సింగ్ అతని బౌలింగ్ శైలిపై పనిచేశారు. 2019-20 సీజన్‌లో బెంగాల్ రంజీ జట్టుకు ముంద్రా నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. అక్కడ అప్పటి బ్యాటింగ్ కన్సల్టెంట్ వీవీఎస్ లక్ష్మణ్, కోచ్ అరుణ్ లాల్, మనోజ్ తివారీలను తన బౌలింగ్‌తో ముంద్రా ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రసిద్ధ సోనెట్ క్లబ్ కోచ్ దివంగత తారక్ సిన్హా కూడా ముంద్రా కష్టపడే తత్వాన్ని మెచ్చుకున్నారు.

ఐర్లాండ్‌కు ప్రయాణం..

క్రికెట్‌పై విపరీతమైన ఇష్టమున్న ముంద్రా, 2021లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం ఐర్లాండ్ వెళ్లాడు. అక్కడ డబ్లిన్‌లోని లెయిన్‌స్టర్ క్రికెట్ క్లబ్‌కు ఆడుతూ 2023లో ఐరిష్ సీనియర్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ముంద్రా నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో కోచ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ అతడిని గుర్తుపట్టారు, బుమ్రా కూడా కొన్ని బౌలింగ్ చిట్కాలు చెప్పాడు.

ఉద్యోగం వదిలి క్రికెట్ వైపు..

ముంద్రా కొంతకాలం ప్రముఖ టెక్ సంస్థ ఇంటెల్‌లో ఉద్యోగం చేస్తూనే క్రికెట్ ఆడాడు. అయితే 2025 జూన్ నుండి ఉద్యోగానికి విరామం ఇచ్చి, పూర్తి సమయం క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌లో నివసిస్తున్న ముంద్రా లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఇప్పటికీ ‘ఓపెన్ టు వర్క్’ అని ఉన్నప్పటికీ, తాజా ప్రదర్శనతో అతనికి టీ20 ఫ్రాంచైజీల్లో మంచి అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.

ఆనందంలో కుటుంబ సభ్యులు..

ఐర్లాండ్ గెలుపుతో టోంక్‌లో ఉన్న ముంద్రా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితుల అభినందనలతో ఇల్లు సందడిగా మారింది. భారత్ ఓడిపోవడం కొంచెం బాధ కలిగించినా, కొడుకు అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించడం తమకు ఎంతో గర్వంగా ఉందని అతని తల్లి విద్యా ముంద్రా సంతోషం వ్యక్తం చేశారు. అంతా దేవుడి దయ అని, భవిష్యత్తులో కూడా అతను ఇలాగే రాణించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>