కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. భార్యను అతి కిరాతకంగా చంపి ఆపై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న సంచలన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూకపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మి దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే, క్షణికావేశంలో నాగరాజు తన భార్య లక్ష్మి (32) గొంతుకు టవల్ గట్టిగా చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.
భార్య చనిపోయిందనే భయంతోనో లేదా పశ్చాత్తాపంతోనో కానీ తర్వాత నాగరాజు (40) సైతం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మల్యాల పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనతో నూకపల్లి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

