కలం, వెబ్ డెస్క్ : భారతదేశ ద్విచక్ర వాహన రంగంలో హీరో మోటోకార్ప్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. 2026 మే నెలకు సంబంధించిన వాహన అమ్మకాల గణాంకాల్లో హీరో స్ప్లెండర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన బైక్గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఒక్క మోడల్ ఏకంగా 3,48,115 యూనిట్ల అమ్మకాలతో టాప్ 10 బైకు (Top Selling Bikes)ల మొత్తం అమ్మకాల్లో 38.6 శాతం భారీ వాటాను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. సామాన్యుడి బైక్గా పేరొందిన స్ప్లెండర్ మైలేజీ, నమ్మకంతో మార్కెట్లో తిరుగులేని లీడర్గా కొనసాగుతోంది.
ఇక ఈ జాబితాలో హోండా సంస్థకు చెందిన పాపులర్ మోడల్ హోండా షైన్ 1,55,441 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీని వెనుకే యువతను ఎంతగానో ఆకట్టుకునే బజాజ్ పల్సర్ సిరీస్ 1,24,270 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు బైకులు కలిపి మార్కెట్లో అత్యధిక విక్రయాలను నమోదు చేశాయి.
టాప్ 10 జాబితాలోని మిగిలిన మోడళ్లను (Top Selling Bikes) పరిశీలిస్తే.. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 66,722 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉండగా, టీవీఎస్ అపాచీ 53,900 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో హోండా సిబి యూనికార్న్ 34,925 యూనిట్లు, టీవీఎస్ రైడర్ 34,852 యూనిట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ 34,594 యూనిట్ల అమ్మకాలతో నిలిచాయి. జాబితాలో చివరి రెండు స్థానాల్లో బజాజ్ ప్లాటినా 26,467 యూనిట్లతో, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ 23,372 యూనిట్ల అమ్మకాలతో నిలిచాయి. మొత్తంగా మే 2026లో కస్టమర్లు బడ్జెట్, మైలేజ్ బైకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
Read Also: రాగి పాత్రలో నీరు తాగుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రమాదమే!
Follow Us On: Instagram

