కలం, నిజామాబాద్ బ్యూరో: మా గొంతు నొక్కడం కాదు.. యాప్ రద్దు చేసి రైతులకు ఎరువులు విరివిగా దొరికేలా చేయండి అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో తలపెట్టిన రైతు మహా ధర్నాలో పాల్గొనేందుకు ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరే క్రమంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇంటి ముందే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రైతులకు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఎరువులు ఇచ్చే విషయం పై దృష్టి పెట్టకుండా తాము రైతుల న్యాయమైన సమస్యపై ఆందోళన చేసేందుకు సిద్ధమైతే తమను అక్కడికి రమ్మని ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. తమపై దృష్టి పెట్టడం కాదు ఎరువుల యాప్ రద్దు చేసి రైతుల గురించి ఆలోచించాలని హితవు పలికారు. లేకపోతే రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు.

