కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు (Chittoor) జిల్లాలో మామిడి ప్రాసెసింగ్ కేంద్రంలో అన్లోడింగ్ ఆలస్యం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూనే వ్యవసాయం చేస్తున్న లోకేశ్ అనే రైతు తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన ఒంటిపై డీజిల్ పోసుకుని నిరసన వ్యక్తం చేయడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు, మామిడి కాయలతో వచ్చిన ట్రాక్టర్లు, వాహనాలు రోజుల తరబడి అన్లోడింగ్ కోసం వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సులు ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తూ, సాధారణ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న తోటి రైతులు వెంటనే స్పందించి అతన్ని అడ్డుకోగా ప్రమాదం తప్పింది. అనంతరం పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారగా, అధికారులు రైతులతో చర్చలు జరిపారు.

