కలం, కరీంనగర్ బ్యూరో: రాజకీయ విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదని.. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం అని కోరుట్ల ఎమ్మెల్యే (Korutla MLA) కల్వకుంట్ల సంజయ్ కుమార్ (Kalvakuntla Sanjay Kumar) పేర్కొన్నారు. జగిత్యాల (Jagtial) జిల్లా కోరుట్ల మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్టణంలోని పలు సమస్యలపై చర్చించారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
బోర్ల ద్వారా నీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని, ప్రతి కౌన్సిలర్కు మైక్ సౌకర్యం ఇవ్వాలని కోరారు. కోరుట్లలోని ప్రభుత్వ భూముల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కోరుట్లలోని గడి బురుజు భూములను రక్షించడం చాలా ముఖ్యమైన అంశమని, వాటిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వర్షాల కారణంగా కొన్ని వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోయే సమస్యను అధికారుల దృష్టికి తెచ్చారు.

