Mobile Popup Ad
Mobile Popup Ad

టాస్క్‌ఫోర్స్ దాడులు.. అక్రమార్కులకు దడ!

కలం, కరీంనగర్ బ్యూరో : ఇసుక అక్రమ రవాణా, రేషన్ బియ్యం మళ్లింపు, గంజాయి విక్రయాలు, కల్తీ ఆహార పదార్థాల తయారీ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వరుస దాడులు నిర్వహిస్తూ కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ (Karimnagar Task Force) పోలీసులు అక్రమార్కులకు దడ పుట్టిస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న ఈ విభాగం ఇప్పుడు మళ్లీ చురుకుగా మారి పాత వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తున్నది. గతంలో అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపిన కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ విభాగం, ఇటీవల కొందరు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలతో ప్రతిష్టను కోల్పోయింది. పరిస్థితి తీవ్రమవడంతో ఉన్నతాధికారులు ఒకేసారి పలువురు సిబ్బందిని ఇతర విభాగాలకు అటాచ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత విభాగాన్ని ప్రక్షాళన చేసి మరింత సమర్థవంతంగా పనిచేసేలా పునర్వ్యవస్థీకరించారు.

వరుస దాడులతో కలకలం

ఈ నెల 9న కరీంనగర్ మార్కెట్ పరిధిలో కల్తీ కారం పొడి విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 బస్తాల కారం పొడి, పసుపు, ధనియాల పొడిని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. జమ్మికుంట మండలం విలాసాగర్‌లో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి సుమారు 150 ట్రాక్టర్ల లోడ్ల అక్రమ ఇసుక డంపులను గుర్తించి జమ్మికుంట పోలీసులకు అప్పగించారు.

మానకొండూర్ మండలం వెల్ది గ్రామంలో ఆరు ఇసుక డంపులు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని 56 ట్రాక్టర్ల లోడ్లకు పైగా ఇసుకను పట్టుకున్నారు. కొత్తపల్లి మండలంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఇసుక డంపులను గుర్తించి 80కి పైగా ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి 22 గంజాయి ప్యాకెట్లు, నాలుగు గంజాయి చాక్లెట్లు, ఒక పల్సర్ బైక్, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి మండలం రాములపల్లిలో 50 ట్రాక్టర్ల లోడ్ల ఇసుక డంపు, శాంతినగర్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ సమీపంలో మరో 30 ట్రాక్టర్ల లోడ్ల ఇసుక డంపును టాస్క్‌ఫోర్స్ బృందం సీజ్ చేసింది. నాగుల మల్యాల గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన మరో భారీ ఇసుక డంపును గుర్తించి 30 ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను స్వాధీనం చేసుకుని కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించింది.

ప్రజల్లో విశ్వాసం పెంచే దిశగా..

ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ ఆహార పదార్థాల తయారీ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమ ఇసుక రవాణా, మాదకద్రవ్యాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి సంపాదించేందుకు టాస్క్‌ఫోర్స్ ప్రయత్నిస్తోంది. నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే ప్రత్యేక యూనిట్‌గా ఈ విభాగాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు.

కమిషనర్ వార్నింగ్

అక్రమ దందాలకు పాల్పడేవారిపై టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిరంతర దాడులు కొనసాగుతాయని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం ద్వారా జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>