కలం, నిర్మల్: శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం (Nirmal Accident)లో ఒక మహిళ మృతి చెందగా, మరో అరుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ప్యారామూర్ గ్రామానికి చెందిన సుంకరి వసంత తన బంధువులతో కలిసి ఆదివారం సోన్ మండలం సాకెర గ్రామంలో జరిగిన నామకరణ కార్యక్రమానికి ఆటోలో వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన బైక్ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వసంత తలకు తీవ్ర గాయాలు కాగా, డ్రైవర్తో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి వసంత మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

