కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో ఇంటర్మీడియట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్ యూజీ (NEET – UG 2026) స్టేట్ కంట్రోల్ రూమ్ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) పరిశీలించారు. మంత్రి వెంట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా క్రిస్టినా జెడ్ చొంగ్తు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. నీట్ పరీక్ష కోసం తీసుకున్న ఏర్పాట్లపై స్టేట్ కంట్రోల్ రూమ్ ఇంచార్జి అధికారులు రాష్ట్ర డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. నరేంద్ర కుమార్, కేంద్ర విద్యా శాఖ డైరెక్టర్ రవీందర్, డీఐజీ నాయక్ లతో చర్చించారు. నీట్ పరీక్ష పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరగాలని ఆదేశించారు.
పరీక్ష విజయవంతంపై అధికారులు తీసుకున్న జాగ్రత్తలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 జిల్లాలలో 208 పరీక్ష కేంద్రాలలో 73,058 మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం హాజరయ్యారని తెలిపారు. నీట్ పరీక్ష కేంద్రాలతో అనుసంధానం చేసిన సీసీటీవీ సర్విలియన్స్ తో స్టేట్ కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్ష కేంద్రాలను నిరంతరం అధికారులు మానిటరింగ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా ఏర్పాటుచేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు.

