కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా ములకలపల్లి (Mulakalapalli) మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం పట్టణానికి చెందిన ఒక కుటుంబం ములకలపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైంది. కార్యక్రమం ముగిసిన అనంతరం వారు తిరిగి కారులో భద్రాచలం బయలుదేరారు.
ఈ క్రమంలో ములకలపల్లి మండలంలోని పూసుగూడెం – మాదారం గ్రామాల మధ్యకు చేరుకున్నప్పుడు, కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ దారుణ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సాయి కుమార్ (26), దూడలా సంధ్యతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి కుమార్ తల్లి జ్యోతిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ములకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు శుభకార్యానికి వెళ్లి వస్తూ ఇలా ప్రమాదానికి గురై మృతి చెందడంతో భద్రాచలం పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

