కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామ శివారులో రాజీవ్ రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఒక స్కూటీ బలంగా ఢీకొట్టిన ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రకు చెందిన మహేంద్ర లక్ష్మణ్ (28), అతని భార్య దీక్ష (25) ప్రస్తుతం మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం వీరు తమ స్కూటీపై ప్రయాణిస్తుండగా, లకుడారం గ్రామ శివారులోకి రాగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వీరి ద్విచక్రవాహనం వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. స్కూటీ నడుపుతున్న భర్త మహేంద్ర లక్ష్మణ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన భార్య దీక్షను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూసింది.

