కలం, మెదక్ బ్యూరో: కుటుంబ కలహాలు ఓ నిండు సంసారంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. భార్య ఆత్మహత్య చేసుకున్న రెండు రోజులకే, మనస్తాపంతో భర్త కూడా చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మెదక్ (Medak) జిల్లా తూప్రాన్ (Toopran) మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సాదుల భిక్షపతి (45) కి అతని భార్య సాదుల వెంకటమ్మ (40) కి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన భార్య వెంకటమ్మ.. ఈ నెల జూన్ 17న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
భార్య ఆత్మహత్యను తట్టుకోలేకపోయిన భర్త భిక్షపతి.. ఆమె చనిపోయిన రెండు రోజులకే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తూప్రాన్ (Toopran) పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. అయితే, ఈరోజు ఉదయం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని తాను కుంట వద్ద ఓ చెట్టుకు భిక్షపతి ఉరివేసుకుని మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరి మృతికి కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇస్లాంపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Follow Us On: Instagram

