కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా బీఎల్వోలకు తిరిగి ఇవ్వాలని వనపర్తి (Wanaparthy) జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శనివారం ఆర్డీవో కార్యాలయంతో పాటు కేడీఆర్ నగర్, చందాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి బీఎల్వోలు, సూపర్వైజర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి రోజు డిజిటలైజేషన్..
ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రతి బీఎల్వో రోజుకు కనీసం 100 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వాలంటీర్ల సహాయాన్ని తీసుకోవాలన్నారు. ఫారాలను సమర్పించని పక్షంలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోయే అవకాశం ఉందని ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు.
ఓటర్లకు సహకరించాలి..
ఆర్డీఓ కార్యాలయంలో సర్ హెల్ప్డెస్క్ పరిశీలించిన కలెక్టర్, 2002లో సంబంధించిన వివరాలను గుర్తించడంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. కేడీఆర్ నగర్లో కొంతమంది బీఎల్వోలు ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేసి, సకాలంలో వాటిని సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేయాలని హెచ్చరించారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

